ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ఓ బయోపిక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ముంబయి కాల్పుల్లో వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మేజర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉన్ని కృష్ణన్ పాత్రలో శేష్ కనిపించబోతున్నారు. పాత్ర కోసం శరీరాకృతిని మార్చుకునే పనిలో పడ్డారు శేష్. ఇందుకోసం ఆయన జిమ్లో కసరత్తులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నారు.
పాత్రలో సహజత్వం ఉండేందుకు ఆర్మీ క్యాంపులు సందర్శించి అక్కడి అధికారులతో సంభాషణలు జరుపుతున్నారట ఈ హీరో. ఇప్పటివరకూ థ్రిల్లర్ కథలను ప్రేక్షకులకి సరికొత్తగా చూపించి విజయం అందుకున్న శేష్ బయోపిక్తో ఎలా అలరిస్తాడో చూడాలి. ‘గూఢచారి’ ఫేం శశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.