జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాడు తన సిధ్ధాంతాలు రైటని, నేడు తననే మొసగాడంటున్నాడని.. పవన్ ఓ ఊసరవెళ్ళి అంటూ మండిపడ్డారు. పవన్ అన్న చిరంజీవి పార్టీని అమ్ముకుని పోతే.. అదే చేసేందుకన్నట్టుగా పవన్ వచ్చాడని విమర్శించారు. ప్రజలను మోసం చేసి టోపీలు వేయడానికి వైసీపీ, జనసేన పార్టీలు వచ్చాయన్నారు. జగన్ కోడికత్తి ఘటన అంతా ఓ డ్రామా అని ఆయన పేర్కొన్నారు. పీఎం మోడీని ఎదిరించి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంది అని ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిధ్ధమన్నారు. నిజాయితీగా పనిచేస్తుంటే తమపై సీబీఐ దాడులు జరపడం ఎంత వరకు సమంజసం అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇక రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న నాయకులకు ఎప్పుడూ అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు ఏదైనా అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోనని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి పేరు చెబుతా.. వాళ్ళను ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించండన్నారు. అనంతలో 14 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలూ కచ్చితంగా గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలు గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.