Homeపొలిటికల్AP Elections 2024: జగన్‌కు చంద్రబాబు సవాల్‌

AP Elections 2024: జగన్‌కు చంద్రబాబు సవాల్‌

AP Elections 2024AP Elections 2024: విజయనగరం జిల్లా నెలిమర్లలో ప్రజాగళం-వారాహి విజయభేరి సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ… సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ఇవాళ టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో.. మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ఈసారి ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు నేడు నెల్లిమర్ల నుంచి బదులిచ్చారు.

నెల్లిమర్ల నుంచి సవాల్ విసురుతున్నా… వై కాంట్ పులివెందుల? ఏ ముఖం పెట్టుకుని పులివెందులలో ఓటు అడుగుతావు? బాబాయ్ ని చంపావని ఓటు అడుగుతావా? నెల్లిమర్లలో ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతావు? రేపు గొడ్డలి పంపిస్తానని ఓటు అడుగుతావా? అందుకే అభివృద్ధి చేసే పార్టీలకు ఓటేయాలని కోరుతున్నాను. జగన్ రుషికొండను మింగేస్తే, ఇక్కడ ఉండే అప్పలనాయుడు ఆయనను ఆదర్శంగా తీసుకున్నాడు. మొత్తం నియోజకవర్గంలోని కొండలన్నీ మింగేసిన అనకొండ ఈ అప్పలనాయుడు.. అని చంద్రబాబు అన్నారు.

ముఖ్యమంత్రిని ఒక్క మాట అంటే పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్ట్ చేస్తారని, కానీ దేవుడి విగ్రహానికి తల తీసేస్తే ఒక్క మాట కూడా మాట్లాడరని చంద్రబాబు పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చివరికి ఆ విషయంలో కూడా తనపైనే కేసులు పెడతారని అన్నారు. తన మీద ఉండే 22 కేసుల్లో అది కూడా ఒక కేసు అని వెల్లడించారు.

యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. అధికారంలో వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. రూ.4వేలు చొప్పున వృద్ధాప్య పింఛను ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దే అందిస్తామని ప్రకటించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక నాటకం ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందని, ఈసారి గులకరాయి డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.

“దేవుడికి అన్యాయం జరిగిందని నేను చెబితే, నాపై కేసు పెట్టి బొక్కలో వేస్తామన్నారు. అదీ పిచ్చి తుగ్లక్ పరిపాలన. ఈ తుగ్లక్ ను కొనసాగిస్తారా? బస్సు యాత్రలో ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే తిరుగుతున్నాడు. సవాల్ విసురుతున్నా… ఉత్తరాంధ్రకు ఒక్క ప్రాజెక్టునైనా తెచ్చావా సైకో జగన్? ఒక్క సాగునీటి ప్రాజక్టునైనా పూర్తి చేశావా? యువతకు ఉద్యోగాలు ఇచ్చావా? మహిళలకు న్యాయం చేశావా? ఎవరికీ న్యాయం చేయనివాడు ఇప్పుడొచ్చి కోతలు కోస్తున్నాడు.

నేను భోగాపురం ఎయిర్ పోర్టు తీసుకువచ్చాను. నేను ఎయిర్ పోర్టు పెట్టాలనుకుంటే విశాఖ, తూర్పు గోదావరి జిల్లా మధ్యలో పెట్టేవాడ్ని… కానీ నాకు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంది. అందుకే భోగాపురంలో పెడితే ఇక్కడ్నించి ఉత్తరాంధ్రకు ముఖద్వారం అవుతుందని భావించాను. తద్వారా పరిశ్రమలు వస్తాయి, మీకు ఉపాధి లభిస్తుందని ఆశించాను. నేను అధికారంలో ఉంటే ఈ పాటికి భోగాపురం పూర్తయ్యేది.

2750 ఎకరాల భూసేకరణ చేసి, శంకుస్థాపన చేశాను. కానీ ఈ సైకో జగన్ నేను ఎక్కడైనా శంకుస్థాపన చేస్తే, దానికి మళ్లీ శంకుస్థాపన చేస్తాడు. పనిమాత్రం పూర్తి చేయడు. నేనుంటే 2021కే భోగాపురం పూర్తయ్యేది. ఇప్పుడు హామీ ఇస్తున్నా.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును 2025కి పూర్తి చేస్తాను. ఒక ఎయిర్ పోర్టు వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయి.

జగన్ కు ఇంకా దింపుడు కల్లం ఆశలు పోలేదు. ఇవాళ శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాడు. క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చాడు, రూ.500 ఇచ్చాడు. ఎంత ఇచ్చినా ఇక్కడి మన మీటింగ్ కు వచ్చినంత జోష్ జగన్ మీటింగ్ కు వస్తుందా? ఇవాళ నెల్లిమర్లలో జనసముద్రం కనిపిస్తోంది. చూసినంత మేర జనం కనిపిస్తూనే ఉన్నారు. మీకు ఒకటే హామీ ఇస్తున్నా. ఇవాళ నేను, పవన్ కల్యాణ్, బీజేపీ కలిశాం. ఎంతో తగ్గి రాష్ట్రం కోసం నిర్ణయం తీసుకున్నాం.

అధికారం కోసం కాదు… పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కూటమిగా ఏర్పడ్డాం. సైకో పోవాలి… రాష్ట్రం బాగుపడాలి అన్న ధ్యేయంతో పనిచేశాం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాపై అభిమానం ఉంటే చాలదు. రేపు ఎన్నికల రోజున అభ్యర్థులను గెలిపించాలి. ఇక్కడ నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ నుంచి మాధవి పోటీ చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆమెను అసెంబ్లీకి పంపాలి. పవన్ కల్యాణ్ పై అభిమానం ఉండే జనసైనికులు అటు అసెంబ్లీ సెగ్మెంట్లో మాధవికి ఓటు వేసి, ఇటు పార్లమెంటు సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!