టాలీవుడ్ సినీయర్ ఆర్టిస్టుల్లో బ్రహ్మాజీ ఒకరు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలన్ని వెల్లడించారు. చెన్నైలో ఉన్నప్పుడు పరిచయమైన ఒక బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ఆయన తెలిపారు.
ఇక తమకు పెళ్లి జరిగే సమయానికి ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుందని… అప్పటికే ఆమెకు ఓ బాబు ఉన్నాడని చెప్పారు. అప్పటికే బాబు ఉన్నప్పుడు మనకు మళ్లీ పిల్లలు ఎందుకని అనిపించిందని… అందుకే పిల్లలు వద్దనుకున్నామని తెలిపారు. ఆ అబ్బాయి ‘పిట్టకథ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడని చెప్పారు.
తన సినిమా జీవితం గురించి బ్రహ్మాజీ మాట్లాడుతూ… తనకు సినిమా కష్టాలేమీ లేవని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి, పశ్చిమగోదావరి జిల్లాలో పెరిగానని… తన తండ్రి తహసీల్దార్ అని చెప్పారు. చదువు పూర్తయిన తర్వాత చెన్నైకి వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నానని తెలిపారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలోనే తనకు రవితేజ, కృష్ణవంశీ, రాజా రవీంద్ర వంటి వారు పరిచయమయ్యారని చెప్పారు. తన కెరీర్ తొలి రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చిందని… అయితే ఆ తర్వాత పదేళ్ల పాటు వచ్చిన పాత్రలు తనకు సంతోషాన్ని ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ మంచి పాత్రలు వస్తున్నాయని చెప్పారు.