సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. డిశ్చార్జి పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించాలని గతంలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కేసుల విచారణ పూర్తయ్యాకే ఈడీ కేసుల విచారణ జరపాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత డిశ్చార్జి పిటిషన్లు అన్నింటినీ ఒకేసారి విచారణ జరిపేందుకు కోర్టు నిరాకరించింది. వేర్వేరుగా విచారణ జరపాలని న్యాయస్థానం నిర్ణయించింది. పెన్నా ఛార్జిషీట్లో అనుబంధ అభియోగ పత్రంపై ఈరోజు విచారణ ప్రక్రియను సీబీఐ కోర్టు ప్రారంభించింది. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా ఈరోజు విచారణకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ కేసులో మిగతా నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, కొందరు పారిశ్రామికవేత్తలు కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అన్ని కేసుల విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది