ప్రధాని మోదీ పాలనలో సంక్షేమం పడకేసిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ నిధులు ఏపీకి కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ గతంలో వైఎస్ను తెలంగాణ సీఎం కేసీఆర్ నిందించారని.. “రాజా ఆఫ్ కరప్షన్” పుస్తకంపై కేసీఆర్దే రెండో సంతకమని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే కేసీఆర్ వైఎస్ను పొగుడుతున్నారని విమర్శించారు. బీసీల్లో అపోహలు తేవాలని వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. మోడి డైరెక్షన్లోనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను టీడీపీకి దూరం చేయాలనే కుతంత్రాలు చేస్తున్నారని.. ఆ మూడు పార్టీల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
బీసీలే సంఘటితంగా కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. చిత్తూరుకు కృష్ణా జలాలు రావడం ఒక చరిత్ర అని.. కృష్ణా జలాలకు రాయలసీమ ప్రజలు హారతులు పడుతున్నారని చెప్పారు. నాలుగు సీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వగలిగామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామన్నారు. ప్రతిపక్షం పూర్తిగా డీలాపడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోల్కతాలో నిర్వహించిన విపక్షాల సభకు 10 లక్షల మందికి పైగా తరలివచ్చారని.. అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభను దీనికి దీటుగా నిర్వహించాలని నేతలకు సూచించారు.