తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. బుధవారం నగరంలోని సనత్నగర్ నియోజకవర్గంలో ఆయన ప్రజాకూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు వల్లే తెలంగాణ సంపద పెరిగిందని ఎంపీ కవిత చెప్పారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ హైటెక్ సిటీ అయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ, ఇప్పుడు నన్నెందుకు తిడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. 13సీట్లతో నేను ఇక్కడ సీఎంను కాలేను. ప్రజాకూటమి అధికారంలోకి రావాలి. బంగారు తెలంగాణ రావాలి. దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారు. నేను అడ్డుపడ్డానా? డబుల్ బెడ్రూం ఇళ్లకు నేను అడ్డుపడ్డానా? మహిళలకు మంత్రి పదవి నేను ఇవ్వొద్దని చెప్పానా? తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ఆగస్టులోనే ప్రణాళిక రూపొందించారు. నరేంద్రమోడీ సహకారంతోనే ఎన్నికల నిర్వహణ జరుగుతోంది.’
‘బీజేపీ, జగన్, టీఆర్ఎస్, పవన్ అందరూ ఒక్కటే. తెలంగాణలో సంపద పెంచింది నేనే. తెలంగాణ అభివృద్ధికి టీడీపీ పనిచేసింది. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోడీ వల్ల దేశం భ్రష్టు పట్టిపోయింది. కాపాడుకోవాలా? వద్దా? టీఆర్ఎస్ ఏ ఫ్రంట్లో ఉంది. బీజేపీతో లాలూచీ లేదా? నిన్న ఒకరినొకరు విమర్శించుకుని నాటకాలు ఆడుతున్నారు. దేశ ప్రయోజనాల కోసం మేము కాంగ్రెస్తో కలిశాం. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. నేను నా జీవితంలో ఎప్పుడూ చూడనంత స్పందన సనత్నగర్లో చూస్తున్నా. రేపటి నుంచి వారు ప్రలోభాలు మొదలు పెడతారు. విపరీతంగా డబ్బులు ఖర్చుపెడతారు. దేనికీ మీరు లొంగిపోకండి. ఈవీఎంల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు అనుకున్న వ్యక్తికి ఓటు పడకపోతే వెంటనే ఫిర్యాదు చేయండి. తెలుగుజాతి ఒక్కటి అనుకుంటే నీటి సమస్య ఉండదు. అలా జరగాలంటే ప్రజాకూటమి అధికారంలోకి రావాలి’ అని చంద్రబాబు అన్నారు.