ప్రముఖ సినీ నటి త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తుంది. తాను ఎన్నో సినిమాల్లో రేప్ సీన్స్ లో నటించానని… ‘లియో’ చిత్రంలో ఆఫర్ వచ్చినప్పుడు కూడా త్రిషతో రేప్ సీన్ చేసే అవకాశం ఉంటుందేమోనని భావించానని… కానీ ఆ సినిమాలో అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధపడ్డానని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక పలువురు సెలబ్రెటీలకు కూడా త్రిషకి మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే నితిన్, రోజాలతో పాటు పలువురు స్పందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై స్పందించారు.
త్రిష గురించి మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని చిరంజీవి తెలిపారు. ఈ వ్యాఖ్యలు కేవలం సినీ ఆర్టిస్టులకే కాకుండా ఏ మహిళకైనా లేదా ఏ అమ్మాయికైనా అసహ్యంగా ఉంటాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండించాలని అన్నారు. వక్ర బుద్ధితో వారు కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. త్రిషతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు బాధితులుగా మారిన ప్రతి మహిళకు తాను అండగా నిలబడతానని అన్నారు.