తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ దాయాదుల్లా ఒకరితో ఒకరు తలపడుతున్నారు. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం మొదలైంది. 10 రోజులుగా ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక చిన్న ఫిర్యాదుతో మొదలైన ఈ యుద్ధం రెండు రాష్ట్రాల మధ్య, ప్రభుత్వ అధినేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. 2 రాష్ట్రాల పోలీసులు డేటా చోరీపై దర్యాప్తులు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. రెండు రాష్ట్రాల్లో వీటి దర్యాప్తునకు సిట్లు ఏర్పాటు చేశారు.
2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య దూరం వైరంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీగా నిలదొక్కుకుంటోంది. ఆ టైమ్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరతీశారు. అదేసమయంలో టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి టీకాంగ్రెస్తో కలిసి టీడీపీ బరిలో దిగడం.. చంద్రబాబు వచ్చి తెలంగాణలో ప్రచారం చేయడం ఇద్దరు సీఎంల మధ్య దూరం పెంచింది. ప్రచారంలో పేలిన మాటలతూటాలు ఇద్దరినీ తాకాయి. అధికార విపక్షాలకు మధ్య జరిగాయని చెప్పడం కన్నా, తెలంగాణ సీఎం కేసీఆర్కు.. ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య ఎన్నికలు జరిగాయన్న రీతిలో ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారు. గత ఎన్నికల కంటే మెరుగైన బలంతో గెలిచి టీఆర్ఎస్ పీఠమెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్-టీడీపీ బంధం జాతీయ రాజకీయాలకే పరిమితమైంది.
తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ అన్నారు. ఎవరేం గిప్ట్లు ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధమని చంద్రబాబు వారిని ఆహ్వానించారు. ఇంతలోనే ఏపీలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తామంటూ మజ్లిస్ పార్టీ కూడా ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆశావహులు పార్టీలు మారటం కూడా కామన్ అయిపోయింది. ఈ సమయంలో టీడీపీకి చెందిన యాప్ మీద ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఇద్దరి మధ్య మరోసారి అగ్గి రాజేసింది. ఇప్పుడు చంద్రబాబుపై తెలంగాణ ప్రభుత్వం కేసుల యుద్ధం చేస్తోంది.