ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్.. తనపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తికి ‘ఛపాక్’ మూవీ ఓ గుణపాఠం అవ్వాలని అంటున్నారు. ఆమె జీవితాధారంగా బాలీవుడ్లో ‘ఛపాక్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. లక్ష్మి పాత్రలో దీపిక పదుకొణె నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మి సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎలాంటి పతకాలు గెలవలేదు. అలాంటిది నా జీవితాధారంగా బయోపిక్ వస్తుందని ఎవరు ఊహించగలరు చెప్పండి? కానీ మేఘనా గుల్జార్ సినిమా తీస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆమెకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. యాసిడ్ దాడి బాధితురాలినైన నేను చేస్తున్న మంచి పనిని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆమె భావిస్తున్నందుకు జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటాను’
‘అందులోనూ దీపిక లాంటి స్టార్ నటి నా పాత్రలో నటిస్తున్నారు. నాపై దాడి చేసి నా జీవితం నాశనం చేసిన వాడికి, నన్నో క్రిమినల్లా చూసిన సమాజానికి ఈ చిత్రం ఓ గుణపాఠం అవుతుందని మాత్రం చెప్పగలను. సినిమాలో నన్ను పోలి ఉన్న దీపిక లుక్ చూసి వావ్ అనుకున్నాను. ఎందరో మేకప్ ఆర్టిస్ట్లు దీపిక లుక్ను మళ్లీ రూపొందిస్తూ సోషల్మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫొటోలను నాకు పంపిస్తున్నారు. ఓ యాసిడ్ దాడి బాధితురాలి ముఖాన్ని కూడా రీక్రియేట్ చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు’ అని వెల్లడించారు లక్ష్మి.
ప్రస్తుతం ‘ఛపాక్’ చిత్రీకరణ ముంబయి, ఢిల్లీలో జరుగుతోంది. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. 2020 జనవరి 10న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.