సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ప్రెస్ లో ఈరోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ప్యాంట్రీ కోచ్ కి అంటుకున్న మంటలు, థర్డ్ ఎసి బి1, స్లీపర్ క్లాస్ ఎస్ 10 బోగీకి వ్యాపించాయి. ఆ సమయంలో ట్రైన్ వేగంగా వెళుతుండటంతో క్షణాల్లో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన రైలు సిబ్బంది ఢిల్లీ సరిహద్దు బాలగఢ్ రైలును నిలిపివేసి నిప్పంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. మరో గంటలో ట్రైన్ గమ్యానికి చేరుతుందనగా ఫరీదాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అందరూ సురక్షితంగా ఉన్నారని అంటున్నారు. హైదారాబాద్ నుంచి ఢిల్లీ పయనమైన ఈ తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఈరోజు ఉదయం 9గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. ఢిల్లీకి సమీపంలో ఉండగానే ఉదయం 8గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని ప్రయాణికులు భావిస్తున్నారు. అయితే ప్రమాద ఘటన ,మీద రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.