‘దృశ్యం’ వంటి సూపర్హిట్ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్యకావ్యం ‘ఘటన’. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్ జె. సత్తార్ హీరోగా మలయాళంలో సూపర్హిట్ అయిన ’22 ఫిమేల్ కొట్టాయం’ చిత్రాన్ని సన్మూన్ క్రియేషన్స్ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్. కృష్ణ ఎం. ‘ఘటన’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అక్టోబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ.. ”దృశ్యం’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్హాసన్గారు చేశారు. తెలుగులో, తమిళ్లో ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. దృశ్యం తర్వాత నేను తెలుగులో చేస్తున్న సినిమా ‘ఘటన’. ఆడదంటే ఆటబొమ్మ కాదు.., ఏదైనా చేయగల ఆది పరాశక్తి అని తెలియజేసే చిత్రమిది. సినిమా కమర్షియల్గా ఉంటుంది. సినిమాలో మెయిన్రోల్లో నిత్యా మీనన్ అద్భుతంగా నటించింది. సమాజంలో జరిగే విషయాలను ఈ సినిమాలో ఒక పర్సనల్ వ్యక్తికి జరిగినప్పుడు, ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడనేదే ఈ సినిమా” అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ”సినిమా డిఫరెంట్ సబ్జెక్ట్తో తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్. నర్సు ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్ళే అమ్మాయిలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు అనే విషయాన్ని ఒక వ్యక్తి ఆధారంగా చేసుకుని శ్రీప్రియగారు తెరకెక్కించారు. ఇలాంటి మహిళా సబ్జెక్ట్ను డీల్ చేయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్. శ్రీప్రియగారు సినిమాను చాలా బాగా తీశారు” అన్నారు.