తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఓ ప్రణాళిక ఉందన్నారు. అయితే, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన తమ పార్టీకి బరిలో నిలవడం ఒకింత కష్టతరమని భావించి పోటీ విరమించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో జనసేన పోటీచేస్తే ఎంతో కొంత పార్టీకి లాభం వుంటుందని ఆ పార్టీ కార్యకర్తలు భావించారు. కనీసం కొన్ని స్థానాల్లోనైనా పోటీచేసి ఉంటే బాగుండేదని కొందరి అభిప్రాయం.
తెలంగాణ ప్రజల పక్షాన నిలబడటమే జనసేన లక్ష్యమని పవన్ తన ప్రకటనలో చెప్పారు. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్ ప్రకారం రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమయాత్తం అవుతుందని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.