హైదరాబాద్లోని శంషాబాద్ శివారులో జరిగిన పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ ఘటనను ఖండించారు. ప్రియాంకరెడ్డి హత్య మనసును కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు విటుంటే గుండె తరుక్కుపోతుందని అన్నారు. మనం మగ మృగాల మధ్య బతుకున్నామా? ఆడపిల్లలకు భద్రత లేదా అనిపిస్తోందంటూ బాధను వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలన్నారు. మరెవరైనా నేరం చేయాలంటే భయం కలిగించేలా ఆ శిక్షలు ఉండాలని.. దుర్మార్గులను నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదని అన్నారు.
ఈ వ్యవహారంలో పోలీసులు సత్వరమే దర్యాప్తు జరిపి నేరస్తులను పట్టుకోవడం అభినందనీయమని తెలిపారు. వారికి త్వరగా శిక్ష పడేలా చూడడం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ఆడపిల్లలందరికీ మీ ఫోన్లలో 100 నంబర్ ను స్టోర్ చేసుకోండి. అలాగే మీ స్మార్ట్ ఫోన్లలో హాక్ ఐ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు షీ టీమ్స్ వెంటనే స్పందిస్తాయి. పోలీసు విభాగం సేవలను, వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అంటూ చిరంజీవి ఓ వీడియోలో తన సందేశం వినిపించారు.