మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవల అత్యంత రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో నరేశ్ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 22న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే శివాజీ రాజా పదవీకాలం ఈ నెల 31 వరకు ఉంది. దీంతో అప్పటి వరకు ‘మా’ కుర్చీలో ఎవరూ (నూతన కార్యవర్గానికి చెందిన వారు) కూర్చో కూడదని, లేకపోతే కోర్టుకు వెళ్తానని శివాజీరాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కృష్ణమోహన్ అధ్యక్షతన శనివారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
‘మా’లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అవన్నీ మర్చిపోయి ‘మా’ గుట్టు బయటపడకుండా అందర్నీ కలుపుకొనిపోయి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయినా మమ్మల్ని పనిచేసుకోనీయకుండా వెనక్కి లాగుతున్నారు. చిత్ర పరిశ్రమలోని పెద్దల అంగీకారంతో వారి సమక్షంలో ఈ 22న మంచి ముహూర్తం ఖరారు చేసుకొని ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నాం. ‘నా పదవీకాలం 31వ తేదీ వరకు ఉంది అప్పటి వరకు ఎవరూ మా కుర్చీలో కూర్చో వద్దు’ అని శివాజీ రాజా చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పెద్దలు ఎలా చెప్తే అలా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, ఈసీ మెంబర్స్ పాల్గొన్నారు.