తెలుగు నటీనటుల సంఘంలో నెలకొన్న వివాదాలపై ఆ సంస్థ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. ‘రఘుపతి వెంకయ్యనాయుడు’ సినిమా విడుదల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన ‘మా’ అంతర్గత విభేదాలపై స్పష్టత ఇచ్చారు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడే తాను ఒక టర్మ్ మాత్రమే అధ్యక్షుడిగా చేస్తానని చెప్పినట్లు నరేష్ పేర్కొన్నారు. ‘మా’ అంటే రాజకీయపార్టీ కాదని సేవా సంస్థగా భావించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి పెద్దల సహకారంతో అందర్ని కలుపుకొనిపోతున్నాను. నేను వచ్చిన ఆరు నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేశాను. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల అనుకున్నది చేయలేకపోయా. ‘మా’లో ఆదిపత్యపోరు, వివాదాలు ఉన్న మాట వాస్తవమే. నా టర్మ్లో సంవత్సరం పూర్తైంది. మరో సంవత్సరం ఉంది.
‘మా’ అధ్యక్ష పదవి నుంచి దిగిపోమ్మంటే ఈ క్షణమే దిగిపోడానికి సిధ్ధంగా ఉన్నాను. ఎవరు నన్ను బయటకు పంపించలేరు. సభ్యుల ఓట్లతో గెలిచా. నేను అందరికి అజాత శత్రువును.’ అని నరేష్ పేర్కొన్నారు.