జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృష్ణా.. నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే.. వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని అన్నారు. వరద ఉద్ధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడడం మానేసి.. కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా? లేదా? అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటం మంత్రుల బాధ్యతా?అని నిలదీశారు. వరద ఉద్ధృతి పెరిగితే కరకట్ట ప్రాంతంలో ఉన్న అన్ని నివాసాలూ మునుగుతాయని, అందుకోసం డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదని పవన్ అన్నారు.
ముందుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావాల్సిన అన్ని రకాల సహాయాలు చేయాలని పవన్ సూచించారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా? అని ప్రతిపక్షం, మునిగిందా?లేదా? అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్లి రాజకీయాలు చేస్తూ ప్రజలను వరద నీటికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తరువాత చూసుకోవాలని సూచించారు.
151 సీట్లు వచ్చిన అధికార పార్టీ.. ప్రజల పట్ల బాధ్యతతో సుపరిపాలన అందించాలని, అంతేగానీ విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించడం తగదన్నారు. జనసేన ఎప్పుడూ రాజకీయాల్లో హుందాతనం కోరుకుంటుందని చెప్పారు.