ప్రధాని నరేంద్ర మోడీ పోటీ 2014లో భారీ మెజార్టీతో గెలుపొందిన వారణాసి పార్లమెంటరీ స్థానం నుంచే చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పుడు రెండు స్థానాల్లో గెలుపొందినప్పటికీ మరో స్థానాన్ని వదులుకొని, ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి స్థానాన్ని అట్టిపెట్టుకున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరో టెంపుల్ టౌన్ పూరీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రధాని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరీ నుంచి పోటీపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఆ వార్తలను కొట్టిపారేయనూ లేదు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా మోడీ మరోసారి వారణాసి స్థానం నుంచే పోటీ చేసి అప్పటి విజయాన్ని రిపీట్ చేస్తారని ఆశిస్తోంది. అయితే మరో నియోజకవర్గం కింద పూరీని ఎంచుకుంటారని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
పోయిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని వారణాసి, గుజరాత్లోని వడోదర స్థానం నుంచి పోటీ చేసి, రెండింట్లోను విజయం సాధించారు. తరవాత పవిత్ర నగరం వారణాసిని అట్టిపెట్టుకున్నారు. అక్కడ తన ప్రత్యర్థులు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీకి తరఫున పోటీ చేసిన అజయ్ రాయ్ పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014లో యూపీలో 80 పార్లమెంటరీ స్థానాలకు గానూ, 71 స్థానాలు గెలుచుకుంది. కానీ ఇప్పుడు కొన్నినెలల క్రితం ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి చుక్కెదురైన సంగతి తెలిసిందే. దాంతో పశ్చిమ్ బంగ, ఒడిశాపై బీజేపీ దృష్టిపెట్టింది. ప్రధాని మోడీ ఒడిశాలో పోటీ చేయడం వల్ల బీజేపీ బలోపేతం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ ఈ వారంలో జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తుంది.