బాలీవుడ్ ప్రేమజంట రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. నిన్న మెహందీ వేడుకలు జరగగా, పెళ్లి నేడే జరగనుంది. గురువారం ఉదయం నుంచే ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహ వేడుక వేదిక వద్దకు చేరుకోవడం స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 14వ తేదీ మధ్యాహ్నం వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కపూర్ల వారసత్వంగా వస్తున్న ఇల్లు ‘వాస్తు’ లో అలియా, రణబీర్ వివాహం చేసుకుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వీరిద్దరి వివాహం హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం కాబోయే శ్రీమతికి కాస్ట్లీ కానుక ఇచ్చాడట రణబీర్ కపూర్.
అంతేకాదు ఆ కానుకకు మరో ప్రత్యేకత కూడా ఉందట. ఇంతకీ ఆ కాస్ట్లీ గిఫ్ట్ ఏమిటంటే ‘8 ఖరీదైన వజ్రాలు పొదిగిన వెడ్డింగ్ బ్యాండ్. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే 8. అలియా భట్ కు 8 అనేది లక్కీ నెంబర్ అని, అందుకే రణబీర్ 8 వజ్రాలతో తయారు చేయించిన ఈ ఖరీదైన బ్యాండ్ ను అలియాకు బహుకరించాడని టాక్ నడుస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు. కానీ రణబీర్-అలియాలకు సంబంధించి ఏ న్యూస్ బయటకు వచ్చినా అది ఆసక్తికరంగానే మారుతోంది. ఏదైతేనేం ఎట్టకేలకు వీరిద్దరి పెళ్లి చూడాలని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అభిమానుల కల నెరవేరే రోజు వచ్చేసింది !