‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ లో ప్రభాస్ కనిపించే విధానం చాలా కొత్తగా ఉంటుందని నటుడు అరుణ్ విజయ్ అన్నారు. ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘సాహో’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు త్వరలోనే పండగ రాబోతోంది. ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుందని ప్రభాస్ చెప్పారు. ఆయనకు నా ధన్యవాదాలు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అలాంటి వ్యక్తి నటించిన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. సుజీత్ చూడటానికి చాలా చిన్నవారిలా కనిపించినా, అతని విజన్ చాలా పెద్దది. జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్నితిన్ ముకేశ్ తదితర నటులతో మంచి నటన రాబట్టుకున్నారు. హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశం కోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డారు. అది థియేటర్లో చూస్తేనే ఆ అనుభూతి ఆస్వాదించగలం. ఇప్పటికే ప్రభాస్కు తమిళంలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాతో అది మరింత పెరుగుతుంది. ‘బాహుబలి’ లో చూసిన ప్రభాస్కూ ‘సాహో’ లో చూసే ప్రభాస్కు చాలా తేడా ఉంటుంది. యాక్టింగ్, స్టైల్, నటన అన్నీ కొత్తగా ఉంటాయి. ఒక కొత్త ప్రభాస్ను చూస్తారు’ అని చెప్పుకొచ్చారు.
‘ఫ్యాన్స్ చాలా మందికి ఉంటారు. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్కు ఓపిక ఎక్కువ. అందుకే సినిమాలో ‘వారంతా డైహార్డ్ ఫ్యాన్స్’ అన్న డైలాగ్ రాశా అని చెప్పుకొచ్చారు దర్శకుడు సుజీత్. ‘సాహో’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘బాహుబలి’ తర్వాత వెంటనే ప్రభాస్ నుంచి సినిమా రావాలని ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ, రెండేళ్లు ఎంతో ఓపికగా వేచి చూశారు. అందుకు ధన్యవాదాలు. నా ఒత్తిడులన్నీ నా ఫ్రెండ్స్కు, అమ్మానాన్నలకు ఇస్తా. అందుకే సెట్లో నేను ఎక్కువ ప్రశాంతంగా ఉంటా. షార్ట్ ఫిలింస్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చా. ఒక షార్ట్ ఫిలింకు సంబంధించిన డీవీడీని ప్రభాస్ అన్న చూసి, నన్ను పిలిపించారు. అప్పుడు నేను ‘మిర్చి’సినిమా చూస్తున్నా. ప్రభాస్ పిలుస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా. సరదాగా అన్నారేమోనని అప్పుడు వెళ్లలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు వెళ్తే, ‘ఏంటి.. డార్లింగ్ అప్పుడు పిలిస్తే రాలేదు’అన్నారు. ఆయన మైండ్ పెద్ద హార్డ్డిస్క్. నాలుగేళ్ల కిందట కూడా చెప్పినవి ఆయనకు గుర్తు ఉంటుంది. ట్రైలర్ చివరిలో ప్రభాస్ అన్న తలలో నుంచి రక్తం వస్తూ ఉండే సన్నివేశం ఉంటుంది. తొలుత ఈ షాట్ గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు కూడా ఆయన ఆ షాట్ను గుర్తు పెట్టుకున్నారు. రాజమౌళిగారి సినిమా తర్వాత ప్రభాస్ చిత్రం చేయడమంటే సముద్రానికి ఎదురు ఈదడమే. కానీ, నాపై ప్రభాస్కు ఎంతో నమ్మకం ఉంది. అందుకే ప్రోత్సహించారు. మదిగారు, సాబూ శిరిల్ సర్, కమల్ కణ్ణన్ సర్, జిబ్రాన్ ఈ సినిమాకు ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు బలం. చివరి 30 నిమిషాలు విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. నిర్మాతలుగా వంశీ, ప్రమోద్ అన్నలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. వారందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
‘సాహో’ నిర్మాతలను చూసి ఆలిండియా స్థాయిలో సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటానని ప్రముఖ నిర్మాత దిల్రాజు అన్నారు. ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన ఆయన మరో నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డితో కలిసి మాట్లాడారు. ‘ప్రభాస్ మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియదు. నేను చాలా మంది స్టార్ హీరోలను చూశాను. కానీ, ప్రభాస్ దగ్గరకు వెళ్తుంటే బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లినట్లుంది. ఏ రాష్ట్రానికీ వెళ్లినా ఇప్పుడు ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి’ చిత్రాల మాదిరిగా ‘సాహో’ కూడా భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. ఇక శ్యాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. ‘నేనే కాదు, మా ఇంట్లో వాళ్లు కూడా ప్రభాస్ సినిమా కోసం ఎంతో వేచి చూస్తున్నారు. మొదటి రోజే సినిమా టికెట్లు కావాలని అప్పుడే చెప్పేశారు. ప్రభాస్ అన్ని వయసుల వారికీ డార్లింగ్. రెండేళ్ల కిందట భారతీయ వెండితెరపై చరిత్ర సృష్టించాడు. అదే విధంగా ‘సాహో’తో ఆ రికార్డును తిరగరాయాలి’ అని అన్నారు.
ఇక మరో నిర్మాత అల్లు అరవింద మాట్లాడుతూ.. ‘మనం ఏ పని చేసినా గణపతిని తలుచుకుని పూజ చేస్తాం. అలాగే ఆలిండియా స్థాయిలో సినిమా తీయాలంటే ‘బాహుబలి’ని తలుచుకోవాల్సిందే. ఒక తెలుగు వాడు జాతీయ స్థాయిలో స్టార్గా ఎదిగాడు. ఈ సినిమా నిర్మాతలు వంశీ, ప్రమోద్లకు భయం అనే చిప్ను మైండ్ నుంచి తీసేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనం తీసే సినిమా మళ్లీ ఎవరూ తీయకూడదన్న స్థాయిలో దర్శకుడు ఈ సినిమాను తీశాడు. అందరికీ నా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.