మహారాష్ట్రలో షిరిడీ సాయిబాబా జన్మస్థలంపై వివాదం రాజుకుంది.. సాయి పాథ్రిలోనే జన్మించారని స్థానికులు చెబుతుండగా.. ఉన్నట్టుండి తాజాగా మహారాష్ట్ర సర్కార్ పాథ్రిలోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో వివాదం మొదలైంది.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్.. ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించినట్టు ఓ ప్రకటన వెలువడింది. దీంతో నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే షిరిడీ ఆలయాన్ని మూసివేయడం ఏంటి? అనే ఆందోళన భక్తుల్లో మొదలైంది. ఈ వార్తలపై ఆలయ ట్రస్టు తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. ఉద్దవ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై షిరిడీ గ్రామస్థులతో చర్చిస్తామని ప్రకటించింది. ఇక, గ్రామస్తుల నిర్ణయంతో సాయిబాబా ట్రస్ట్కు సంబంధం లేదని… రేపు ఆలయంలో సేవలు యథాతథంగా ఉంటాయని షిరిడీ సాయిబాబా ట్రస్ట్ పీఆర్వో మోహన్ పేరుతో తాజాగా ప్రకటన విడుదలైంది.