దిశ హత్యాచార ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తులకు కఠిన శిక్షలు పడాలని యావత్ దేశం డిమాండ్ చేసింది. ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్న చట్టాలన్నీ వెంటనే సవరించాలని, మరింత కఠినంగా మార్చాలని ప్రతిఒక్కరు గళమెత్తి నినదించారు. నిందితులకు వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దిశ హంతకులను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం ఆ డిమాండ్కు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే అత్యాచార నిందితులపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదని స్పష్టం చేశారు.
‘దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టాలంటే ప్రస్తుతం ఉన్న చట్టాలను మరోసారి సమీక్షించాలని అన్నారు. అత్యాచార నిందితులను క్షమించాల్సిన అవసరం లేదన్నారు. క్షమాభిక్ష పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలని వాటిపై రివ్యూ జరగాలని తెలిపారు. మహిళల రక్షణకు పౌరులు కోరుకునే చట్టం రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజస్తాన్లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రామ్నాథ్ కోవింద్ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. దేశమంతా కఠిన చట్టాలను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా నిర్భయ దోషుల్లో ఒకరు ఇటీవల రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష
పిటిషన్ను తిరస్కరించిన విషయం తెలిసిందే.