మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే. ఉపాసన తాను చేసే సామాజిక సేవ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటారు. సేవా కార్యక్రమాలతో రామ్ చరణ్ భార్యగాను, అపొలో అధినేత మనవరాలిగానే కాకుండా ఉపాసన తనకంటూ ఓ ప్రత్యేకమైన
గుర్తింపును తెచ్చుకున్నారు. మూగ జీవాల రక్షణలోనూ ముందుండే ఉపాసన ఇప్పుడు హైదరాబాద్లోని జూపార్క్లో 2 సింహాలను దత్తత తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఫిట్నెస్, ఆయుర్వేదం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు.
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లోని విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను దత్తత తీసుకున్నారు. వాటి సంరంక్షణ బాధ్యతలు, ఆహారపు ఖర్చులను ఏడాదిపాటు చూసుకోనున్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజశేఖర్కు అందించారు. పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ, మంచి ఆరోగ్య పరిస్థితి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె తెలిపారు. క్యూరేటర్, అతని బృంద సభ్యులను ఆమె అభినందించారు. జూలో ఉంచిన 2000 జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని, వాటి పరిశుభ్రత విషయంలో సిబ్బంది అంకితభావంపై ఉపాసన ప్రశంసలు కురిపించారు. వన్యప్రాణుల పరిరక్షణపై ఉపాసన చూపించిన నిబద్ధత ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్. ఆమెది చాలా మంచి మనసని కొనియాడారు. ఇలా పార్కులోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరారు.