రాబోయే సార్వత్రిక ఎన్నికలకు జనసేన దాదాపు దూరమైనట్టేనని సంకేతాలు అందుతున్నాయి. రోజురోజుకు వైఎస్సార్సీపీ పుంజుకుంటున్న నేపథ్యంలో ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోతున్నాయన్న సమాచారంతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం. ఇలాంటి టైమ్లో ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు సరికదా.. ఓట్లు కూడా సాధించలేమని పరిశీలకుల నుంచి అందిన రిపోర్టుల ప్రకారం ఆయనీ నిర్ణయం తీసుకున్నారని జన సైనికలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
టీడీపీ ఓటమి ఖాయమౌతున్న తరుణంలో 2019 ఎన్నికల తర్వాత ఫ్రెష్గా రాజకీయాలు స్టార్ట్ చేసి రాబోయే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. పైగా అప్పటికి టీడీపీ కూడా నిర్వీర్యం అయిపోతే.. ఆ స్థానంలో జనసేన పునరుత్తేజంతో సత్తా చాటవచ్చనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. పైగా ఆర్థిక సమస్యలు కూడా పార్టీని ముందగుడు వేయనీయడం లేదు. అయితే చంద్రబాబు ఆహ్వానం మేరకు మరో విధంగా ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు. టీడీపీతో బహిరంగంగా పొత్తు పెట్టుకోకుండా స్నేహపూర్వక పోటీకి అంగీకరించాలని కూడా జనసేనలో మరో వర్గం డిమాండ్ చేస్తున్నది. ఉత్తరాంధ్ర సహా తూగో, పగో జిల్లాల్లో పోటీ చేసి కనీసం 10 స్థానాలనైనా గెలుపొందాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఆయా స్థానాల్లో టీడీపీ డమ్మీ అభ్యర్థులను బరిలోకి దించనుంది. ఇలా చేస్తే జనసేన అభ్యర్థుల ఖర్చు, ఆ పార్టీ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించినట్టు సమాచారం. అవసరమైతే కొంతమంది జనసేన నాయకులను టీడీపీలో చేర్చుకుని పోటీ చేయించడం మూడో ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారు.