ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 241వ రోజు సోమవారం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటఉరట్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పటి దాకా బీజేపీ సహా ఐదు పార్టీలతో పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేయడం, విడాకులు ఇవ్వడం కూడా అయిపోయిందని అన్నారు. తాజాగా కాంగ్రెస్ను పెళ్లి చేసుకోవడానికి చంద్రబాబు సిద్ధమైపోయారని అన్నారు. కాంగ్రెస్ను శాశ్వతంగా బహిష్కరించినా కసి తీరదని ఏడాది క్రితం చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేసిందేమిటి? రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో దగ్గరుండి మద్దతిస్తాడా? ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్తో దొడ్డిదారి రాయబారం చేస్తాడా? ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తూ రాజకీయం చేస్తున్నారని వైఎస్ జగన్ నిప్పులు రిగారు.
చంద్రబాబు పరిపూర్ణమైన అవకాశవాది అని యావత్ రాష్ట్రానికి తెలిసిపోయిందన్నారు. నాలుగేళ్ల ఈయన పాలనకూ, 150 ఏళ్ల బ్రిటీష్ పాలనకూ తేడా ఏమైనా ఉందా.. అని ప్రశ్నించారు. ఇప్పటికే బీజేపీని పెళ్లి చేసుకుని వదిలేశాడు. టీఆర్ఎస్తో, సీపీఐతో, సీపీఎంతో, చివరకు జనసేనను కూడా పెళ్లి చేసుకుని వదిలేశాడు. ఇప్పుడు నిస్సిగ్గుగా.. కాంగ్రెస్ను పెళ్లి చేసుకునేందుకు బయల్దేరాడు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రంగులు మారుస్తున్న ఈ పెద్దమనిషిని చూశాక పరిపూర్ణమైన అవకాశవాది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైందని జగన్ విమర్శించారు.