ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీలో చేరుతున్నారంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానిపై స్పందిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలంటే ఎన్నో విధాలుగా చేయొచ్చని తెలిపారు. ఇటీవల విశాఖలో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత జగన్ను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని సాంబశివరావు అన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాను విశాఖ సీపీగా కలిశానని.. అదే విధంగా జగన్నూ కలిశానని సాంబశివరావు స్పష్టం చేశారు.
సమన్వయలోపం కారణంగానే తాను వైకాపాలో చేరుతున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించి ఉండవచ్చని సాంబశివరావు తెలిపారు. ఈరోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన సాంబశివరావు కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించారు. సీఎంతో జరిగిన భేటీలో రాజకీయ ప్రస్తావన రాలేదన్న సాంబశివరావు.. గంగవరం పోర్టు, విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధిపై సలహాలు ఇచ్చినట్లు వెల్లడించారు.