సినీ పరిశ్రమలో నటిగా బ్రేక్ రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన నటి పెరల్ పంజాబీ ఆత్మహత్య చేసుకున్నారు. తను ఉంటున్న అపార్ట్మెంట్పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. పెరల్ చాలా కాలంగా నటిగా బ్రేక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ అది జరగకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
పెరల్ ముంబయిలోని ఓషివారా అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఆమె మానసిక స్థితి బాలేదు. తల్లితో ఆమెకు తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఓషివారా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ బిపిన్ కుమార్ ఠాకూర్కు ఏదో శబ్దం వినిపించింది. రోడ్డుపై ఎవరో అరుస్తున్నారనుకుని.. వెళ్లి చూసొచ్చాడు. ఇంతలోపే మూడో అంతస్తు నుంచి కేకలు వినిపించాయి. పెరల్ అపార్ట్మెంట్పై నుంచి దూకారు. తీవ్రంగా గాయాలు కావడంతో మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.