కరోనా అనుమానితులు క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారందరికీ రూ. 2 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. అలాగే క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు మరింత పెంచాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 2,100 మందికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోజుకు 4 వేల పరీక్షలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన 32 వేలమందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. క్వారంటైన్ పూర్తి చేసుకొన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను బాధితులకు వివరించాలన్నారు. తర్వాత కూడా వారు ప్రతివారం పరీక్షలు చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.