జాతీయ అవార్డులు గెలుచుకున్న వారికి సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్ర బృందాలను ప్రశంసించారు. ఎస్.ఎస్. రాజమౌళి, నాగార్జున, ఎన్టీఆర్, రానా తదితరులు వరుస ట్వీట్ల ద్వారా అభినందించారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించాల్సిన సమయమని ఆనందం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్ కల్యాణ్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదే సందర్భంగా ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగంలో అవార్డులు గెలుచుకున్నందుకు ‘మహానటి’ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ఇది సావిత్రమ్మకు సరైన నివాళి అని పేర్కొంది. ‘మూడు అవార్డులు గెలుపొందడం గౌరవంగా భావిస్తున్నాం. ఈ సినిమా ప్రయాణం మాకు ఓ అద్భుతమైన అనుభవం. ఇది సావిత్రమ్మకు సరైన నివాళి’ అని పోస్ట్ చేసింది.
పవన్ కల్యాణ్: కీర్తి సురేష్ జాతీయ అవార్డుకు అర్హురాలు. అవార్డులు గెలుచుకున్న ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్ర బృందాలకు నా అభినందనలు. ఏడు పురస్కారాలు దక్కించుకున్నందున ఇదే స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరిన్ని తెలుగు చిత్రాలు రావాలి.
నాగార్జున: జాతీయ అవార్డులు గెలుచుకున్న వారికి నా శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి: తెలుగు చిత్రాలు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్ర బృందాలకు శుభాకాంక్షలు.
ఎన్టీఆర్: తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఆకాశాన్ని తాకుతోంది. జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్ర బృందాలకు శుభాకాంక్షలు.
రానా: జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమ గర్విస్తోంది.
ఎ.ఆర్. మురగదాస్: ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్కు అభినందనలు. ఇలాంటి అవార్డులు నువ్వు మరెన్నో అందుకోవాలని కోరుకుంటున్నా.
అనసూయ: జాతీయ అవార్డు విజేతలకు శుభాకాంక్షలు.
అట్లీ: ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు శుభాకాంక్షలు కీర్తి సురేష్. ఇది గర్వించాల్సిన సమయం. ‘మహానటి’ చిత్ర బృందానికి హ్యాట్సాఫ్.