ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయించేవని.. ప్రజలు వేసే ప్రతి ఓటూ భావితరాల భవిష్యత్ కోసమని అన్నారు. ఇవాల్టితో ఎన్నికల ప్రచారం ముగియనున్న దృష్ట్యా సాయంత్రం 6గంటల వరకూ ప్రచారం ఉద్ధృతంగా చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రెండు రోజులూ అంతా అవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు. దొంగదెబ్బలు తీయడం దుర్మార్గులకు అలవాటని.. అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. వైసీపీ అవినీతి సొమ్ములు వెదజల్లుతోందని, దాడులు చేసి బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. ‘ఎలక్షన్ మిషన్ 2019’ పై కార్యకర్తలు, నాయకులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఓటమి ముందే ఖరారు కావడంతో వైసీపీ బెంబేలెత్తుతోందని.. అరాచకాలు చేయడానికైనా బరితెగిస్తోందని మండిపడ్డారు. 25 లక్షల ఓట్ల తొలగింపునకు కేసీఆర్ తెగించారని.. అదే కుట్రకు ప్రయత్నించి జగన్ భంగపడ్డాడని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రాకు హోదా ఇవ్వడాన్ని కేసీఆర్ వ్యతిరేకించారని.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ మేలు కోసమే కేసీఆర్ ఈ హోదా డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు. జగన్తో కుమ్మక్కు రాజకీయాలను స్వయంగా కేసీఆర్ వెల్లడించి తన నిజ స్వరూపాన్ని ఆయనే బట్టబయలు చేసుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి డీమ్డ్ టు అప్రూవల్ అని చట్టంలో ఉందని.. మరి ఆ ప్రాజెక్టుపై ఎందుకు అన్ని కేసులు వేశారని ప్రశ్నించారు. కేసీఆర్ జగన్కు ఇన్నాళ్లూ చాటుగా డబ్బులు పంపారని, ఇప్పుడు బాహాటంగానే కేసీఆర్ మద్దతు పలికారని అన్నారు. జగన్ను ఓడిస్తేనే కేసీఆర్కు సరైన గుణపాఠం చెప్పినట్లవుతుందని పిలుపునిచ్చారు.