ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్షోలు నిర్వహించారు. గతంలో తాను తీసుకున్న చర్యల వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని చంద్రబాబు అన్నారు. తాను చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. రామ్నగర్, ముషీరాబాద్ కూడళ్లలో చంద్రబాబు మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తులు ప్రజాకూటమిలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. తన హయాంలోనే హైదరాబాద్ చుట్టూ 165 కి.మీ పరిధిలో ఔటర్ రింగ్రోడ్డుకు శ్రీకారం చుట్టామని, మెట్రో రైలు ప్రాజెక్టు తన కృషి వల్లే మంజూరైందని చెప్పారు. ఒక విజన్తో హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశానని, దేశంలో ఏ నగరానికీ హైదరాబాద్తో పోలిక లేదన్నారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ మూడు మేనిఫెస్టోలు విడుదల చేసిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని.. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తానెప్పుడూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడలేదని చెప్పారు. ఓ సీనియర్ నాయకుడిగా దేశంలోని పరిస్థితులను గాడిన పెట్టాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి, లక్ష ఉద్యోగాల భర్తీ తదితర హామీలన్నీ ప్రజాకూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చంద్రబాబు వివరించారు.