ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను అభినందించారు. సిరివెన్నెల ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ చాలాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అదేవిధంగా మా అధ్యక్షుడు శివాజీరాజా, బుర్రా సాయిమాధవ్, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ తదితరులు సోమవారం సిరివెన్నెలకు శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సిరివెన్నెలను కలిసి అభినందనలు తెలిపారు.