తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 531 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజు కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో 16 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 103 మంది డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్లోనే అత్యధికంగా 200 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం సంచలనం సృష్టిస్తోంది. ఇక ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కేసులు పెరగటం కలకలం రేపుతోంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 420కి చేరింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి దశల వారీగా పాజిటివ్ రావడంతో లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. నిత్యావసరాల కోసం ప్రజలను రెండురోజులకోసారి మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు. గుంటూరులో ఆదివారం చికెన్, మటన్ షాపులు కూడా మూసివేయించారు.