2012 డిసెంబర్ 16 వ తేదీన నిర్భయను అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచి ఆమె మృతికి కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. ఆరుగురిలో ఒకరు మైనర్ కావడంతో అతడికి మూడేళ్ళ శిక్ష విధించారు. మిగతా ఐదుగురిలో ప్రధాన నిందితుడు తీహార్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. తీర్పును పునఃసమీక్షించాలంటూ దోషులు వేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
దోషులకు శిక్ష అమలులో జాప్యం జరుగుతుందంటూ వెంటనే దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు పటియాలా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దోషులకు డెత్ వారెంట్ జారీ చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ 14 రోజుల్లో దోషులు మిగిలివున్న తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని కోర్టు తెలిపింది.
ఏడేళ్ల నిరీక్షణ తరువాత నిర్భయకు న్యాయం జరగబోతున్నది. ఇన్నాళ్ల పోరాటం ఫలించిందని నిర్భయ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.