ఏ పదవీ ఆశించి తాను వైసీపీ చేరడం లేదని నటుడు మంచు మోహన్ బాబు స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుంది అని మాత్రమే పార్టీలో చేరాను అని చెప్పారు. వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజంగా పదవులపై మోహం ఉండుంటే 15 ఏళ్ల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే ఏదో ఒక పదవిలో ఉండేవాడినని అన్నారు.
‘ఫీజు రీయిబర్స్మెంట్ విషయంలో చంద్రబాబుతో ఎన్నో సార్లు మాట్లాడాను. ఇప్పటివరకూ మా విద్యాసంస్థకు రూ.19 కోట్ల బకాయిలు రావాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ అనుకున్న సమయానికి ఇవ్వాలి. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మూడు నెలలకోసారి ఇస్తానన్నారు. కానీ సక్రమంగా ఇవ్వలేకపోయారు. దీని ప్రభావం వల్ల కొన్ని కాలేజీల్లో జీతాలివ్వలేకపోవచ్చు. కానీ నేను మాత్రం సొంత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ జీతాలిచ్చాను. నా ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా కదిలించాను. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనప్పుడు మీరు సహకరించాలని తల్లిదండ్రులను పిలిచి చెప్పాను. మాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ బాకీ లేదు. సక్రమంగానే ఉప్పల్లో విద్యా సంస్థ నడుపుతున్నాం. పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను. ఇవి నేను భయపడి చేస్తున్న వ్యాఖ్యలు కాదు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి మీదా దాడులు చేయలేదు’ అని మోహన్ బాబు అన్నారు. జగన్ ఏపీలో స్వీప్ చేస్తారని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు వందేళ్లు సంతోషంగా బతకాలని కోరుకుంటున్నానని, కానీ ఎన్నికల్లో ఓడిపోవాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.