సాధారణంగా మన దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవడం కోసం కప్పలకు వివాహం చేయడం చూస్తుంటాం. మరి వర్షాలు విపరీతంగా కురుస్తోంటే.. వాటిని ఆపడమెలా..? మధ్యప్రదేశ్ ప్రజలు దీనికో కొత్త ఉపాయం కనిపెట్టారు. వర్షాలు కురవాలని పెళ్లి చేసిన కప్పలకు వేద మంత్రోచ్ఛరణల నడుమ విడాకులు ఇప్పించేశారు. ఓం శివశక్తి మండల్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ విడాకుల తంతు జరిపించారు. కప్పలకు విడాకులు ఇప్పించడం ద్వారా భారీ వర్షాలు ఆగిపోతాయని వారు నమ్ముతున్నారు. గడిచిన 24 గంటల్లో మధ్యప్రదేశ్లో 48మి.మీ వర్షం కురిసింది. బోపాల్ కలియసోత్ డ్యామ్,భదాడ డ్యామ్ గేట్లను తెరిచారు. కోలార్ డ్యామ్ గేట్లను కూడా తెరిచి నీటిని కిందకు వదిలారు.
కాగా ఇప్పుడు విడాకులు ఇప్పించిన ఈ కప్పలకు.. వర్షాలు కురవాలని కోరుతూ జులై 19న వివాహం జరిపించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 26శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత ఆదివారం భోపాల్ పట్టణంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో అతివృష్టిని నియంత్రించేందుకు కప్పలకు విడాకులు ఇప్పించారు.