బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. తనకు కాబోయే భర్త గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను తెలియచేశారు. ప్రస్తుతం కంగన బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘పంగా’ సినిమాలో నటిస్తున్నారు. హీరోయిన్ ప్రాధాన్యమున్న ఈ చిత్రంలో ఆమె కబడ్డీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. నితేశ్ తివారీ సతీమణి అశ్విని అయ్యర్ తివారీ ‘పంగా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘పంగా’ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఇదిలా ఉండగా కంగనా రనౌత్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘పంగా’ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలిపారు. ‘అశ్వినీ ఈ కథ చెప్పినప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. బాధలోనైనా, సంతోషంలోనైనా నా ధైర్యం నా కుటుంబమే. నిజ జీవిత కథాంశాలతో సినిమా తీయడంలో అశ్వినీకి మంచి అనుభవం ఉంది. ‘పంగా’ సినిమాలో నేను జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారిణీగా కనిపించనున్నాను. అశ్వినీతో మరిన్ని చిత్రాలు చేయాలని భావిస్తున్నాను’ అని కంగన తెలిపారు.
అనంతరం తన వివాహం గురించి ఏమైనా విశేషాలు చెప్పమని విలేకరి కోరగా.. ‘దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారీ, ఆమె భర్త నితేశ్ తివారీ మధ్య ఉన్న అనుబంధం చూస్తుంటే నాకు కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలని ఉంది. వివాహబంధం గురించి భిన్నాభిప్రాయం ఉన్న నాకు వాళ్లని చూశాక మంచి అభిప్రాయం ఏర్పడింది. నాకు కాబోయే వాడు నాకంటే తెలివైన, టాలెంట్ గలవాడై ఉండాలనుకుంటున్నాను’ అని కంగన వివరించారు. దీంతో కంగన 2020లో వివాహం చేసుకోనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.