ప్రముఖ తమిళ గాయకుడు ఏఎల్. రాఘవన్ (87) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన 1950లో తమిళ చిత్రం ‘కృష్ణ విజయం’తో గాయకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. ఎందరో సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. అందులో కేవీ మహదేవన్, విశ్వనాథ్-రామ్మూర్తి, ఎస్.ఎం.సుబ్బానాయుడు, ఘంటసాల, టీవీ రాజు, ఎస్పీ కోదండపాణి వంటి ఉద్దండులు ఉన్నారు. తోటి గాయకులైన పి.సుశీల, జిక్కి, పి.లీల, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతోనూ కలిసి అనేక పాటలు పాడారు.
తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘నిండు మనసులు’ చిత్రంలో ‘అయ్యయ్యో అదిరిపోతున్నాను..’, ‘నేనే మొనగాణ్ణి’ చిత్రంలోని ఓ గీతాన్ని పాడారు. పేకేటి శివరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘కులగౌరవం’ చిత్రంలో ‘హ్యాపీ లైఫ్..’ అని సాగే గీతాన్ని ఎల్.ఆర్ ఈశ్వరితో కలిసి ఆలపించారు. రాఘవన్ భార్య నటి ఎం.ఎన్ రాజమ్.