ప్రతిపక్ష పార్టీలను, వాటి అనుబంధ ఎల్లో మీడియా సంస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెడుగుడు ఆడుకున్నారట. ఎలా ఆడుకున్నారండీ బాబు, పేపర్ చూసి స్పీచ్ ఇవ్వడం ద్వారా చెడుగుడు ఆడుకున్నారా ?, లేక తన స్పీచ్ లో ఎప్పటిలాగే బటన్ల ప్రస్తావనే ప్రధానం చేసుకుని చెడుగుడు ఆదుకున్నారా ?, జగన్ మాత్రం ఇదే ఒరవడి కొనసాగిస్తే…. ప్రతిపక్షాలు అసలు పోరాటం కూడా చేయక్కర్లేదు. జగన్ పై ప్రజల్లో రోజురోజుకు ఆ రేంజ్ లో అపనమ్మకం పెరిగిపోతుంది. కానీ, వైసీపీ వారు మాత్రం ప్రతిపక్షాలను చెడుగుడు ఆడిన జగన్ అంటూ దబిడిదబిడ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ రోజు జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమానికి వినుకొండను వేదిక చేసుకున్నారు.
నిజానికి వినుకొండ నియోజకవర్గంలో ప్రజల కష్టాలను జగన్ రెడ్డి ఎన్నడూ పట్టించుకోలేదు. అయినా, వినుకొండలో గొప్ప అభివృద్ధి చేశాను అని చెప్పుకునేంత గడుసుతనం ఒక్క జగన్ మోహన్ రెడ్డికే సాధ్యం అవుతుంది. సరే.. ఈ సభలో జగన్ ప్రవర్తన పై ఆయన మీడియా గొప్పలు పోతూ నవ్విస్తోంది. మళ్లీ జగన్ లో పాత లీడర్ కనిపించారట. చాన్నాళ్ల తర్వాత జగన్లో మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా కనిపించిందట. ఈ ముక్క చెప్పుకుని సంతోష పడాల్సిన దుస్థితికి వైసీపీ మీడియా వచ్చినందుకు జగన్ రెడ్డి సిగ్గుపడాలి. అలాగే తన స్పీచ్ లో సగం అబద్ధాలనే మాట్లాడినందుకు జగన్ రెడ్డి తలదించుకోవాలి. “మీ బిడ్డకు పొత్తుల్లేవు. మీ బిడ్డ వాళ్లమీద, వీళ్ల మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే సింహంలా వస్తాడు. తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు. కానీ మీ బిడ్డకు భయం లేదు. కారణం మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని (ప్రజల్ని), దేవుడ్ని మాత్రమే” అంటూ జగన్ రెడ్డి తనను తానుగా ప్రజల బిడ్డగా ప్రకటించుకున్నాడు. ప్రజల బిడ్డ మరెందుకు ఆ ప్రజలు చూడకుండా పరదాల చాటున వెళ్తున్నాడు ?, ప్రజల బిడ్డ మరెందుకు ఆ ప్రజలకు దూరంగా బతుకుతున్నాడు ?, ప్రజల బిడ్డ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలడా ?.
ఎలాగూ ఎన్నికలు దగ్గరకు పడుతున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే ముసలి కన్నీరు కారుస్తున్నట్లు ఉన్నాడు. అయినా బిడ్డ అని చెప్పుకోవడానికి ఎంత దైర్యం కావాలి ?, ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తూ.. వారి బిడ్డగానే చలామణి కావడానికి ఎంత తెగింపు కావాలి ?, ఈ విషయంలో జగన్ రెడ్డిని అభినందించకుండా ఉండలేం. జగన్ మాటల్లో ప్రతి మాట ఎన్నికల కోసమే. “నాకు ముసలాయన మాదిరి ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు. టీవీ5 తోడుగా ఉండక పోవచ్చు. దత్త పుత్రుడు నా కోసం మైకు పట్టుకోకపోవచ్చు. నేను వాళ్లను నమ్ముకోలేదు. నేను నమ్ముకున్నది ఎవరినో తెలుసా ? నా ఎస్సీలను, నా బీసీలను, నా ఎస్టీలను, నా మైనార్టీలను, నా నిరుపేద వర్గాలను”.. ఇలా సాగాయి జగన్ రెడ్డి మాటలు. ఈ మాటలు విన్నాక, ఆ నిరుపేద వర్గాలు ఎందుకు నమ్మవు. అందుకే, మళ్లీ జగన్ రెడ్డిని నమ్ముతాయి అనేది వైసీపీ వారి ఆశ. ఐతే, మళ్లీ జగన్ రెడ్డిని నమ్మడానికి ఆంధ్ర ప్రజలు అంత తెలివి తక్కువ దద్దమ్మలు కాదు కదా.
జగన్ ఎప్పట్లాగే అందరూ కలిసి వచ్చినా తననేం చేయలేరని తేల్చి చెప్పాడు. పైకి చెప్పినా తనను ఏదో చేస్తారనే భయం జగన్ రెడ్డిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే తన పరిస్థితి, తన పార్టీ పరిస్థితి ఏమిటి ? అనేది జగన్ రెడ్డి ముందున్న అతిపెద్ద సమస్య. అందుకే, ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి జగన్ రెడ్డి చేయాల్సింది అంతా చేస్తున్నాడు. నిండు సభలో స్వేచ్ఛగా పచ్చి అబద్దపు మాటలు చెప్పేస్తున్నాడు. అణగారిన వర్గాలను తనవిగా ఆయన పదేపదే చెప్పుకుంటూ తెగ ఎమోషనల్ అవుతున్నాడు. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నమే తప్ప, జగన్ లో మరో ఉద్దేశమే లేదు. జగన్ ప్రసంగంతో పాటు జగన్ రెడ్డి హావభావాలు కూడా అలాగే ఉన్నాయి. కానీ జగనన్నను నమ్మితే ఏం అవుతుందో ఆంధ్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.