బిగ్ బాస్ 5 ఫేమ్ మానస్ ఇప్పటికే పలు చిత్రాలలో, సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మానస్ ఓటీటీ కోసం ఈ వెబ్ సీరిస్ లో నటిస్తున్నాడు. ఈ సీరిస్ లో ‘రాజన్న’ ఫేమ్ యానీ హీరోయిన్గా నటించబోతోంది. విశేషం ఏమంటే మానస్ లానే యానీ సైతం బాలనటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఆమె ‘లూజర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్రను పోషించింది. రొమాంటిక్ కామెడీ జనర్ కు చెందిన ‘చి. ల. సౌ. రాంబాబు’ వెబ్ సీరిస్ ను పిఆర్ఎన్ బాబు దర్శకత్వంలో రమేశ్ చంద్ర సమర్పణలో రవి బండా నిర్మిస్తున్నారు. శశిప్రీతమ్ దీనికి సంగీతాన్ని అందిస్తుండగా రాజీవ్ వల్లభనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు. దీనికి శివ గోపాల్ రెడ్డి క్రియేటివ్ హెడ్.
మహాశివరాత్రి సందర్భంగా ‘చి.ల.సౌ. రాంబాబు’ వెబ్ సీరిస్ షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో మంగళవారం ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 10వ తేదీ నుండి మొదలుకానుంది. ‘బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయని, కానీ మనసుకు నచ్చిన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నానని, ఇది కూడా అలాంటిదేన’ని మానస్ తెలిపాడు. ‘సరదాగా సాగిపోయే రొమాంటిక్ కామెడీ కథ ఇదని, ఇలాంటి వాటి కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాన’ని యానీ చెప్పింది. ‘క్వాలిటీ స్క్రిప్ట్స్ కే తమ తొలి ప్రాధాన్యమని, దానికి తగ్గట్టుగానే రాజీపడకుండా నిర్మించాలన్నది తమ ఆశయమని, రుద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాబోయే రెండేళ్ళలో మరింతగా ఓటీటీ కంటెంట్ ను అందిస్తామని నిర్మాత రవి బండా అన్నారు.