సూపర్స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటితో ముగిసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మూడు పాటలు విడుదలవ్వగా.. వాటికి విశేషమైన స్పందన వచ్చింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ‘జూలై 5న షూటింగ్ ప్రారంభించాం.. డిసెంబర్ 18న ముగించాం. ఈ సంక్రాంతి సినీ ప్రేమికులకు, అభిమానులకు జ్ఞాపకంగా మిగిలిపోతుంద’ని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
అలాగే నేడు నిర్మాత దిల్ రాజు జన్మదినం సందర్భంగా ‘సరిలేరు నీకెవరు’ చిత్ర యూనిట్ ఆయనతో కేక్ కట్ చేయించారు. మహేష్బాబు, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేష్బాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.