స్టార్ హీరో మహేశ్బాబు చట్టానికి కట్టుబడి తన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించారని ఆయన లీగల్ టీమ్ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. మహేశ్ వాణిజ్య ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి ఆర్జించిన మొత్తంపై 2007-08కి సంబంధించి రూ.18.5 లక్షల సేవా పన్ను చెల్లించాల్సి ఉందని, అందుకే ఆయన బ్యాంకు ఖాతాలను జప్తు చేశామని హైదరాబాద్ జీఎస్టీ కమిషనర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై మహేశ్ బృందం స్పందిస్తూ.. వివరణ ఇచ్చింది.
‘జీఎస్టీ కమిషనరేట్, హైదరాబాద్ వారు కోర్టు పరిధిలో ఉన్న రూ.18.5 లక్షల పన్నుని వడ్డీతో కలిపి రూ.73.5 లక్షలు నిర్ణయించి బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించారు. 2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్కు ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి పన్ను పరిధిలోకి రాదు. అంబాసిడర్ సర్వీసెస్ని పన్ను పరిధిలోకి సెక్షన్ 65 (105) ద్వారా 01-07-2010 నుంచి చేర్చారు. పన్ను చెల్లించే వ్యక్తి చట్టపరమైన అన్ని నియమాలకు లోబడే ఉన్నా, ఎటువంటి నోటీసు లేకుండా పైగా ఈ విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ జీఎస్టీ కమిషనరేట్ బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించారు. మహేశ్బాబు చట్టానికి కట్టుబడే పౌరుడిగా తన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించారు’ అంటూ మహేశ్ లీగల్ టీమ్ పేర్కొంది.