టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును నిరూపించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి కూడా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అభిమానులకు కాస్తంత టైమ్ కేటాయిస్తుంటాడు. తాజాగా చిరంజీవి తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరావు అనే అభిమాని కోరిక తీర్చి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. తాజాగా చిరంజీవి అభిమాని ఒకరు తన కొడుకుకు చిరంజీవి చేతుల మీదుగానే నామకరణం చేయాలని పట్టుపట్టి కూర్చుకున్నాడు. ఎవరెంత చెప్పినా స్వయంగా చిరంజీవే తన కొడుకుకు పేరు పెట్టాలని భీష్మించుకుని కూర్చున్నాడు. ఐతే ఎలాగోలా ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లడంతో ఆయన పెద్ద మనసు చేసుకొని అతన్ని తన ఇంటికి పిలుపించుకున్నాడు. అంతేకాదు ఆ పిల్లాడికి తన అసలు పేరు, తమ్ముడి పేరు స్పురించేలా పవన్ శంకర్ అనే నామకరణం చేసారు.
దీంతో సదరు అభిమాని చిరంజీవి చేసిన పని వల్ల ఎంతో ఆనందించాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నక్కా వెంకటేశ్వరావు..చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఆ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. అప్పట్లో ఆయన గ్రామ ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా రాజ్యం కోసం పనిచేయడంతో ఆయన్ని గ్రామస్థులు 5 సంవత్సరాలు వెలివేయడం జరిగింది. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. అతని కుటుంబ సభ్యులను పిలుపించుకొని బట్టలు పెట్టారు కూడా. కాగా గతేడాది నక్కా వేంకటేశ్వరరావుకు ఇదే నెలలో బాబు పుట్టాడు. ఆ పిల్లాడికి చిరంజీవే నామకరణం చేయాలని పట్టుపట్టాడు. దీంతో ఈ సోమవారం చిరంజీవి నుంచి పిలుపు రావడం ఆయన వెళ్లడం నామకరణం జరిగిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి.