పెథాయ్ తుఫాన్ గంటకు 16 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలోనూ.. కాకినాడకు దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తరం దిశగా ఈ తుఫాన్ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోందని.. సోమవారం సాయంత్రంలోగా యానాం, తుని మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. తుఫాన్ ప్రభావంతో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుఫాన్ ప్రభావం కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్తో పాటూ ప్రభుత్వ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇటు పార్టీల కార్యకర్తలు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘తిత్లీ తుఫాన్ మిగిల్చిన కష్టాన్ని మర్చిపోక ముందే పెథాయ్ రూపంలో తుఫాన్ రాష్ట్రంపైకి దూసుకొస్తోంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభావం పడుతోందని సమాచారం వస్తోంది. ఈ తరుణంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకి అందరం అండగా నిలవాలి. ప్రజలను తగు విధంగా అప్రమత్తం చేయండి. ఈ విపత్తు ప్రభావం మనం తీరం నుంచి వెళ్లిపోయి.. ప్రజలకు తెరిపినపడేవరకూ అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని జనసైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను’.
‘తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి.. వారికి ఆహారం, మంచినీళ్లు, ఔషదాలు అందించేందుకు సిద్ధం కావాలి. వృద్ధులు, పిల్లలకు కావాల్సిన సేవలు అందించండి. రైతులు తమ పంటల్ని కాపాడుకనేందుకు చేసే పనుల్లో సాయపడండి’ అంటూ పవన్ కళ్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు.
ప్రజలకు అండగా నిలుద్దాం – JanaSena Chief #PawanKalyan pic.twitter.com/97sg3CUo66
— PawanKalyan Fan | Register Your Vote (@PawanKalyanFan) December 17, 2018