జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని సానుభూతితో తిరిగి చేర్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో విలీనంతో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. తాజా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే సమ్మె విరమిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ ట్వీట్ చేశారు.
”తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి, కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మా ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులు కోరారు. నలభై రోజులకిపైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నా. దీని ద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆపై సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నా” అని పవన్ కళ్యాణ్ ట్విటర్లో పేర్కొన్నారు.