Homeతెలుగు Newsపోలవరం పనుల్లో మేఘా వేగం

పోలవరం పనుల్లో మేఘా వేగం

నీటి వరద తగ్గింది. పనుల వరద పరుగులు పెడుతోంది. గోదావరి తల్లి నెమ్మదించింది. పనుల స్పీడ్ పెరిగింది. ఎప్పుడెప్పుడు ఏపీ ప్రజల కలలను సాకారం చేద్దామా అన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. గతంలో జరిగిన లోటుపాట్లేవీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ప్రభుత్వంలో జరిగిన అశాస్త్రీయ పనులను సవరిస్తూ ఇంజనీరింగ్ పద్ధతిలో పనులను చేయిస్తోంది.

సరైన సమయంలో సరైన వేగం…
ఏది సక్సెస్ కావాలన్నా సరైన సమయం కావాలి. పోలవరం ప్రాజెక్ట్ పనులకు ఇదే సరైన సమయం. అందుకు తగ్గట్టే పనులను స్పీడప్ చేసింది మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మేఘా) కంపెనీ. తన శక్తియుక్తులన్నింటినీ ఈ ప్రాజెక్ట్లో పెడుతోంది. నిర్ణీత గడువుకన్నా ముందే ప్రాజెక్ట్ను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేస్తోంది. ఇప్పటికే తనకున్న రికార్డ్ ట్రాక్ను ఈ ప్రాజెక్ట్లోనూ కొనసాగించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకు ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అడుగులు వేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటోంది. అనతికాలంలోనే ప్రాజెక్ట్లోని స్పిల్వేకు సంబంధించి 62,818 ఘనపు మీటర్ల పనిని చేసింది మేఘా కంపెనీ. ప్రాజెక్ట్లో ప్రధానమైన పనులు వేగవంతం చేసేందుకు గోదావరి నడిఒడ్డున మట్టి పటిష్టతకు సంబంధించి పటుత్వ (VIBRO COMPACTION WORKS UNDER PROGRESS) పరీక్షలు, గ్యాప్-1లో నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్), ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ అవసరం మేరకు అంటే వరద ఉదృతి వల్ల ప్రాజెక్ట్ పనులకు అవరోధం ఎదురుకాని విధంగా చేపట్టే పనులు ముమ్మరం అయ్యాయి.

MEIL polavaram

అనుమతుల కోసం ప్రత్యేక అధికారులు
ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష్యం మేరకు పనులు చేయాలి. అందుకు అనుగుణంగా శాస్త్రీయమైన పద్ధతిలో డిజైన్లకు సంబంధించిన అనుమతులు సాధించాలి. ఈ రెండు చాలా కీలకమైనది. ఇప్పుడు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్లకు అనమతులు లభించకపోతే పనులు వేగంగా చేసినా ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు మొదటికి వస్తుంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్రాజెక్ట్ను పరిశీలించి సమీక్షించినప్పుడు అనుమతులు త్వరగా మంజూరు చేస్తే నిర్దేశించిన గడువు ప్రకారం పనులను పూర్తిచేస్తామని మేఘా యాజమాన్యం స్పష్టం చేసింది. దాంతో డిజైన్ల అనుమతులు సాధించేందుకు ఢిల్లీలోనూ, హైదరాబాద్లోనూ ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి పనులు శాస్త్రీయ పద్ధతిలో ఊపందుకున్నాయి.

చంద్రబాబు దుర్భద్ధి… ప్రాజెక్ట్కు శాపం
ప్రాజెక్ట్ నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, విధానాలు (ఇంజనీరింగ్) స్పష్టంగా ఉన్నాయి. గత ప్రభుత్వం వాటిని ఏమాత్రం పాటించలేదు. పైగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిగా సంక్లిష్టం చేసి కొద్దిపాటి వరదలకే ప్రాజెక్ట్లోకి నీరు చేరడమే కాకుండా గ్రామాలు మునిగిపోయే పరిస్థితిని తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ సమస్యను చక్కదిద్దే విధంగా పనులు స్పీడ్ అయ్యాయి. ప్రాజెక్ట్ పనులను మేఘా సంస్థ నవంబర్లో దక్కించుకున్నప్పటికీ వెంటనే పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. దాదాపు మూడు నెలల పాటు విలువైన సమయం వృధా అయ్యింది. అందుకు గత ప్రభుత్వం నాన్ ఇంజనీరింగ్ పద్ధతిలో పనులు చేపట్టడమే. ముంపు సమస్య తలెత్తి విలువైన సమయం వృధా కావడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్ట్లో కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడమే కారణం. అప్పట్లో ఆయన కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి ఎంతో కొంత నీటిని నిలబెట్టి దాని నుంచి కుడి, ఎడమ కాలువలకు వరద సమయంలో నీటిని విడుదల చేయడం ద్వారా ప్రాజెక్ట్ పాక్షికంగా పూర్తి చేశామని అనిపించుకునేందుకు ఆయన ప్రయత్నించారు.

ఇంజనీరింగ్ విధానానికి విరుద్ధంగా…
నిజానికి ఇది ఇంజనీరింగ్ విధానాలకు వ్యతిరేకం. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఆయన ఒత్తిడికి తలొగ్గి 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించేందుకు అంగీకరించడం మరింత నష్టం చేకూర్చింది. ఇంతవరకు ఏ జలాశయ నిర్మాణాల్లోనూ లేనివిధంగా పోలవరంలో మాత్రమే ఈ విధమైన అనుమతి లభించింది. కాఫర్ డ్యామ్ అనేది ప్రధాన జలాశయంలో నిర్మాణం జరిగేప్పుడు నీరు అడ్డురాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం. దీనివల్ల గత ఏడాది వరదలప్పుడు జలాశయంలో నీరు నిలిచిపోయి పనులు ఆగిపోవడమే కాకుండా నిర్మాణం ప్రాంతంలో నిర్మించిన రహదారులు కొట్టుకుపోయాయి. కనీసం 4 టిఎంసీల నీరు నిలువ ఉండడంతో దానిని తోడితే తప్ప పనులు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో దాదాపు 3 నెలల పాటు పంపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి ఆ నీటిని తరలించాల్సి వచ్చింది. అందువల్లనే జనవరి నెలాఖరుకు కానీ పనులు ఉపందుకుకోవడం సాధ్యం కాలేదు. ప్రాజెక్ట్లో అన్ని పనులకు ఇంజనీరింగ్ పద్ధతిలో సమ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం స్పిల్వేతో పాటు కాఫర్ డ్యామ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. వాటిని కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయింది. ఈ ప్రాజెక్ట్లో ఎర్త్కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ (ప్రధాన ఆనకట్ట)తో పాటు అందులోని మూడు గ్యాప్లు, స్పిల్వే, స్పిల్ చానెల్, అప్రోచ్ చానెల్, పైలెట్ చానెల్, కుడి-ఎడమ కాలువల అనుససంధానంతో పాటు జల విద్యుత్ కేంద్రం కీలకమైనవి. వీటిల్లో చాలా పనులు అసలు గత ప్రభుత్వం చేపట్టనే లేదు. జల విద్యుత్ కేంద్రంలో గంప మట్టికూడా తీయలేదంటే ఎంత నిర్లక్ష్యం చేసిందో అర్థమవుతోంది.

పనుల్లో మేఘా వేగం
జనవరి నుంచి స్పిల్వే పనులు ముమ్మరం చేసిన మేఘా ఇంజనీరింగ్ లక్ష్యానికి అనుగుణంగా వరదతో పోటీ పడిందా అన్నట్లు పనులు సాగిస్తోంది. జనవరిలో 20631 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32124 ఘ.మీ, మార్చిలో ఇప్పటివరకు 21 వేలకు పైగా ఘ.మీ పనిని పూర్తిచేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్వే బీమ్ల నిర్మాణంతో పాటు బ్రిడ్జ్లు, డివైడ్ వాల్, ట్రైనింగ్ వాల్, గైడ్వాల్ పనులను ఉదృతం చేసింది. అదే సమయంలో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్, అందులోని మూడు గ్యాపులు, జల విద్యుత్ కేంద్రం మొదలైన ప్రధానమైన పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిజానికి చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్ట్ నత్తనడక నడిచింది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్లో కీలకమైన అనుమతులన్నీ అప్పుడే సాధించారాయన. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ చూపలేదు. వైయస్ పాలనలోనే దాదాపు కుడి-ఎడమ కాలువలు పూర్తయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో 2010 నుంచి 2019 వరకు కేవలం స్పిల్వేలో కొంత పనితోపాటు డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్ మాత్రమే నిర్మించారు. ఇంతకు  మించి అప్పుడు జరిగిందేమీ లేదు.

డిజైన్లే కీలకం
ఈ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ సంస్థను మార్చి పనులు వేగం చేయించడంతో పాటు అదే సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులల్లో అనుమతులు చాలా కీలకమైనవి. గత ప్రభుత్వ వీటిని నిర్లక్ష్యం చేసింది. మొత్తం ప్రాజెక్ట్లో 45 డిజైన్లు అనుమతి లభించాల్సి ఉండగా వాటిలో 37 డిజైన్లు అనుమతి సాధించడానికి దాదాపు 10 ఏళ్ళ సమయం పట్టింది. మరో ఎనిమిది కీలకమైన డిజైన్ల అనుమతి లభించలేదు. ఇవి ప్రాజెక్ట్లో ముఖ్యమైనవి.

సీఎం జగన్ స్పెషల్ ఫోకస్
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్రాజెక్ట్ పనిని సమీక్షించి ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర జల సంఘం ఆధీనంలోని ప్రాజెక్ట్ అథారిటీ కమిటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మార్చి 8న హైదరాబాద్లో ప్రాజెక్ట్ డిజైన్ల కమిటీ సమావేశమై విస్తృతంగా చర్చించడం ద్వారా పెండింగఖ ఉన్న 8 డిజైన్లకు సంబంధించి దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతిపాదనలను డ్యామ్ డిజైన్ల సమీక్ష బృందం పరిశీలించి కొన్నింటిని తిరస్కరించింది. ముఖ్యంగా ఆనకట్ట (ఎర్త్కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్) మూడో గ్యాపులో మట్టికట్ట నిర్మించాలనే ప్రతిపాదనను నిర్ద్వంధంగా తోసిపుచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా కాంక్రిట్ నిర్మాణం చేపడితేనే ప్రాజెక్ట్ వరదల సమయంలో పటిష్టంగా ఉంటుందని తేల్చిచెప్పింది. ఇంజనీరింగ్ నిపుణులకు ఈ విధమైన స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు అతీతంగా ప్రభుత్వం పనులు చేయిస్తోంది. ప్రాజెక్ట్ డిజైన్ల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని సీడబ్ల్యూసి చైర్మన్ ఏ.డి.పాండ్య అధ్యక్షతన ఏర్పాటైన కమిటీపై ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. దాంతో పెండింగ్లో ఉండిపోయిన అప్రోచ్ ఛానెల్ ఎడమ గట్టుపై ర్యాక్ ఫిల్ గైడ్వాల్ నిర్మించడం, స్పిల్వే నుంచి విడుదలయ్యే వరద ఉధృతిని తట్టుకునే విధంగా ఎడమ గట్టువైపు పటిష్టమైన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ రూపొందించాలని నిర్ణయించింది.

ఆ డిజైన్లకు అనుమతే ముఖ్యం
స్పిల్వే నుంచి విడుదలయ్యే వరద నీరు కుడిగట్టుపై పడుతుంది. దీనికి కూడా పటిష్టమైన డిజైన్ను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. స్పిల్ ఛానెల్ నుంచి వరద నీరు పైలెట్ ఛానెల్ మీదుగా గోదావరి నదిలోకి కలిసే పనులకు సంబంధించి డిజైన్ను కేంద్ర జలసంఘానికి ప్రాజెక్ట్ అధికారులు సమర్పించారు. దీనికి త్వరితగతిన అనుమతి సాధించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రధాన ఆనకట్టలోని గ్యాప్-1లో నిర్మించే మట్టి, రాతి నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ప్రాజెక్ట్లో ఇది ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం దీని అనుమతులు సాధించేందుకు శ్రద్ధ చూపించలేదు. గ్యాప్-2లో ఏ విధమైన నిర్మాణం ఉండాలనే దానిపైన కూడా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విధంగా అనేక పనులకు సంబంధించి ఇప్పుడే ఇంజనీరింగ్ తరహాలో పనులు ముమ్మరం అయ్యాయి. మొత్తానికి ఇక పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అవుతుందనే నమ్మకం ఇప్పుడు కలుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu