సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఎవరు ఊహించలేరు. సినిమా అనేది ఓవర్ నైట్ లో స్టార్ ను చేస్తుంది. అలానే ఫుట్ పాత్ మీదకు కూడా లాగుతుంది. బళ్లు ఓడలవ్వడం, ఓడలు బళ్లు అవ్వడం అనే సామెత సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు శ్రీనువైట్ల పరిస్థితి కూడా అలానే అనిపిస్తోంది. దూకుడు సినిమాతో తన దూకుడు ప్రదర్శించిన వైట్ల ఆ తరువాత వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు. మహేష్ బాబు తో సినిమా చేసే రేంజ్ ఉన్న ఈ దర్శకుడు వరుణ్ తేజ్ తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేస్తానంటే ఆ అవకాశం దక్కింది.
అసలు విషయంలోకి వస్తే.. అప్పటికే ఫ్లాప్స్ లో ఉన్న శ్రీనువైట్లతో సినిమా చేయడానికి ఎవరు ధైర్యం చేయలేదు. దీంతో తన రెమ్యూనరేషన్ ను పెట్టుబడిగా పెట్టి సినిమా చేస్తా అనడంతో ‘మిస్టర్’ సినిమా పట్టాలెక్కింది. రెమ్యూనరేషన్ కింద ఈస్ట్, కృష్ణ, వైజాగ్ జిల్లా హక్కుల్ని తన దగ్గర పెట్టుకున్నాడు శ్రీనువైట్ల. అయితే ఈ చిత్రానికి అసలైన నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిల దగ్గర నుండి వైట్లకు ఒత్తిడి పెరగడంతో కొంత డబ్బుని నిర్మాతలకు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో తన ఫ్లాట్ ను అమ్ముకొని కొంత డబ్బు సర్ధుబాటు చేశారని ఇండస్ట్రీలో టాక్. తన దగ్గరున్న ఏరియాలకు గానూ కొంత డబ్బు వచ్చినా.. అది తన ఆర్థిక పరిస్థితుల నుండి ఏ మాత్రం బయటకు తీసుకొచ్చే అమౌంట్ కాదని తెలుస్తోంది.