‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా కోసం దర్శకుడు, నిర్మాతగా మారిన హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అభినందనలు తెలిపారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ను జక్కన్న శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘నా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి నేను చూస్తున్న, నాకు తెలిసిన మంచి హాస్యనటుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని ట్వీట్ చేశారు. ‘ధన్యవాదాలు రాజమౌళి గారు. మీ ప్రోత్సాహం మా చిత్ర బృందానికి శక్తి, ధైర్యాన్ని ఇచ్చింది’ అని శ్రీనివాస్ రెడ్డి రిప్లై ఇచ్చారు.
‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాలో శ్రీనివాస్ రెడ్డితోపాటు వెన్నెల కిశోర్, షకలక శంకర్, సత్య తదితరులు నటిస్తున్నారు. ఫ్లైయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం యూట్యూబ్లో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిసెంబరు 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.