టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదే క్రమంలో తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. సుధీర్ బాబు తన కెరీర్ లో 15వ చిత్రాన్ని ఎం. హర్షవర్ధన్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన హర్షవర్ధన్.. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘మనం’ ‘చిన్నదానా నీకోసం’ ‘గురు’ వంటి సినిమాలకు డైలాగ్ రైటర్ గా పని చేశారు. ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ తో సుధీర్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇటీవల ‘లవ్ స్టొరీ’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంస్థ ఈ చిత్రాన్ని బ్యాంక్ రోల్ చేస్తోంది. సోనాలి నారంగ్ మరియు సృష్టి సమర్పణలో నారాయణ్ దాస్ కె నారంగ్ – పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
#Sudheer15 చిత్రాన్ని ఈరోజు సోమవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తం షాట్ కి క్లాప్ బోర్డ్ కొట్టిన నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ రావు.. దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి సుధీర్ బాబు – హర్షవర్ధన్ లతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పిజి విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.