గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను గుడ్ విల్ అంబాసిడర్గా తొలగించాలంటూ పాకిస్థాన్ చేస్తున్న అనవసర రాద్ధాంతంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. భారత బలగాలు పాక్లో ఎయిర్ స్ట్రైక్ జరిపినప్పుడు ప్రియాంక జైహింద్ అని ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ప్రియాంక మీద పాకిస్థాన్ అక్కసు పెంచుకుంది. తాజాగా భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమెను గుడ్విల్ అంబాసిడర్గా తొలగించాలని డిమాండ్ చేసింది. దీన్ని ఐరాస తోసిపుచ్చింది. ప్రియాంకకు మద్దతుగా మాట్లాడింది. తాము ఆందోళన చెందే అంశాలపై మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందని పేర్కొంది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి దీనిపై మాట్లాడారు.
యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్లు తమ వ్యక్తిత్వం మేరకు మాట్లాడుకోవచ్చు. ఆందోళనకు గురిచేసే, ఆసక్తి కలిగించే అంశాలపై మాట్లాడే హక్కు వాళ్లకుంది. వారి వ్యక్తిగత అభిప్రాయాలు, అభిరుచులు, చర్యలు యునిసెఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపవు. కానీ యునిసెఫ్ తరఫున మాట్లాడేటప్పుడు మాత్రమే ఇలాంటివి పరిగణిస్తాం. ఇక్కడ గుడ్ విల్ అంబాసిడర్గా ఉండేవాళ్లు స్వతంత్రంగానే వారి విలువైన సమయాన్ని చిన్న పిల్లల హక్కులను కాపాడేందుకు కేటాయిస్తున్నారు అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా ఉంటూ తన మాతృదేశానికి మద్దతుగా మాట్లాడుతుందంటూ రెండు రోజుల క్రితం పాక్ ఆరోపించింది. ఆమెను అంబాసిడర్ హోదా నుంచి తొలగించాలని కోరుతూ యునిసెఫ్కు పాక్ మానవ హక్కుల మంత్రి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే ఆ లేఖను బుధవారం ట్విటర్లో షేర్ చేశారు. పాకిస్థాన్కు సంబంధించి భారత ప్రభుత్వ నిర్ణయాలు, పొంచి ఉన్న అణుముప్పునకు మద్దతు తెలుపుతున్నారని ఆ లేఖలో ప్రియాంక మీద విమర్శలు చేస్తూ, భారత్ మీద అక్కసు వెళ్లగక్కారు.